పరిశుద్ధ గ్రంథమును అర్ధం చేసుకొవటం ఎలా?



పరిశుద్ధ గ్రంథమును అర్ధం చేసుకొవటం ఎలా?

క్రైస్తవుల ‘విశ్వాసము’నకు మూలాధారమైనది ‘పరిశుద్ధ గ్రoధము’, యందలి 66 పుస్తకాలలో 39 పాత నిబంధన నుండి, మరో 27 పుస్తకాలు క్రొత్త నిబంధనవై ఉన్నాయి. షుమారు 1600 సం. ల కాలంలో దాదాపు 40 మంది రచయితలు ‘దేవుని ప్రేరణ’ ద్వారా వీటిని వ్రాశారు.  ఆశ్చర్యకరమైన సంగతేమంటే ఇంతటి సుదీర్గమైన కాలం, భిన్న (కాలాలకు చెందిన) రచయితలైనప్పటికి, దాని ముఖ్య ఉద్దేశoలోగాని, కొనసాగింపులోగాని ఏవిధమైన విశ్చిన్నం లేక (ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు) ‘ఏకాభిప్రాయం’తో ‘పరిపూర్ణo’గా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథమందలి మూల వర్తమానాన్ని మూడు ముక్కల్లో చెప్పాలంటే,
◆ (మొదటిగా) - “దేవుని సంకల్పము” గూర్చియు,
◆ (రెండవదిగా) - దానిని అనుసరించిన “దేవుని వాగ్దానములు”,
◆ (మూడవదిగా) - “సకాలంలో ఆ వాగ్దానముల నెరవేర్పు” అని చెప్పుకోవచ్చు.

కానీ, నేడు మనముందున్న సమస్య (పరిశుద్ధ గ్రంథమును అర్ధం చేసుకొవటం ఎలా?) పాతదే అయినప్పటికీ, నేడు కొంతమంది నిస్వర్ధ సత్యన్వేషకులు, ఈ ‘మహా గ్రంథాన్ని’ అర్ధం చేసుకునే విషయంలో కొన్ని సమస్యలను ఎదుర్కోనటమే కాకుండా కొన్ని సందర్బాలలో పొరపాటు చేస్తున్నరు, ఫలితంగా సత్యం వక్రీకరణకు గురౌతుంది.

అభిషేకము పొందినవారామని, జ్ఞనo పరిపూర్ణత గలవారమని చెప్పుకొనువారిలో ఏ ఒక్కరి వ్యాఖ్యానం మరొక్కరి వ్యాఖ్యానంతో సరిపోవు!  “జిహ్వకో రుచి, పుర్రెకో భుద్ది” అన్నట్లుగా తయారైయిది బైబిలు వ్యాఖ్యాన రీతి!  ప్రతి వాడు నేను చెప్పేదే సత్యము, ఇట్టి విశ్వాసమే బైబిలు విశ్వాసం, ఇట్టి విశ్వాసము గలవారు మాత్రమే పరలోక హక్కు దారులని ఉద్ఘాటిస్తున్నారు.  భిన్నమైన విశ్వాసాలు, అభిప్రాయాలు మనుగడలోకి వచ్చి చేరాయి.  తత్ఫలితముగా ఇప్పటికి 41,000 పైగా మతశాఖలు పుట్టుకొచ్చాయి. ప్రతి శాఖకు తమదైన ట్రేడ్ మార్క్ బోధ! చివరకు ఎటూ తేల్చుకోలేని గందరగోళంలోకి విశ్వాసులను నెట్టివేయ బడుతున్నారు.  ఫలితముగా క్రైస్తవుల మధ్య ‘ఐక్యత’,  ‘సహోదర భావము’ పూర్తిగా దెబ్బతింటుంన్నాయి.

ఇట్టి స్తితిగతులు పూర్తిగా వాక్య విరుద్ధమైనవి. 1 కొరింధీ 1:10 చూ||

దీనికి ప్రధానమైన కారణాలు:-

పరిశుద్ధ గ్రoధము వ్రాయబడిన ‘నేపద్యం’, యందలి ‘సాంప్రదాయాలు’, భాషా పరమైన ‘వ్యవహారికం’, ‘శైలి, ‘ఆచార – వ్యవహారాలు’ వంటి మొ. అంశములపై నేటి పాఠాకునికి అవగాహన లేకపోవటం.

పరిశుద్ధ గ్రoధము సూటిగా తనతోనే మాట్లాడుతున్నదని భావిoచి, యందలి ‘శ్రోతల సమన్వయము’ విస్మరించటం వంటివి ప్రధాన కారణాలు.

మరి కొన్ని సందర్భాలలో నాటి హెబ్రీయుల వ్యవహారిక శైలిఫై ఆవగాహన లేని తర్జుమాల ద్వారాను మరియు శ్రోతలకు వాటి పరిధి, స్వభావంపై సరియైన ఆవగాహన లేకపోవటం వలన కూడా కొంత అఘాధం ఏర్పడుతుంది.  మన అందరికి తెలిసిన విధముగా పాత నిబంధన గ్రంథము గ్రాంధిక భాషలోను (ఇంకా చెప్పాలంటే 2/3 వంతు గద్య భాగంలోను, 1/3 వంతు పధ్య భాగంలోనూ వున్నాయి), క్రొత్త నిబంధన ‘కోయిని’ (నాటి సామాన్యుల భాషాశైలిలో) వ్రాయబడినది. అయితే ఈ రెండిట మొత్తంలో భాషాశాస్త్రంలోని దాదాపు అన్ని రూపాలు మనకు దర్శనమిస్తాయి.

ఉదా :-
● కట్టు కధలు (Fables)
● చిక్కు ప్రశ్నలు (Riddles)
● గూడ వాక్యం (Enigmas)
● సాదృశ్యకాలు (Similes)
● రూపక అలంకారo (Metaphor)
● ఉపమానములు (Parables)
● అలంకారము (Allegories)
● పత్రికలు (Epistles)
● సామెతలు (Proverbs)
● దృస్టాoతములు (Types)
● గురుతులు (Symbols)
● విలక్షణమైన క్రియలు (Typical actions)
● సంకేతాత్మకమైన సూచికలు & రంగులు (Symbolic numbers, colors)
● కలలు (Dreams)
● దర్శనములు (Visions)
● ఊహాజనితాలు (Imaginations)
● ప్రవచనములు (Prophecies) మొ||

కాబట్టి పరిశుద్ధ గ్రంధము గొప్ప ‘సాహితీ సంపద’.  భాషలోని ప్రతి విధమైన ‘శైలి, రీతి-రివాజులు’ ఇందులో పుష్కలంగా ఉన్నాయి.  కాబట్టి వీటిని విస్మరించి, ‘గ్రుడ్డి ఎద్దు చేలో పడినట్లుగా’ మొత్తం అలగా-పులగం చేస్తున్నారు, నేటి బోధకులు! కానీ, భాషలోని ప్రతి శైలిని వివరించటానికి తనదైన ‘నియమ-నిబంధనలు’ ఉంటాయి.  అవి తెలియకపోయినా లేక వాటిని విస్మరించినా పూర్తి అర్ధమే మారిపోతుంది.  సగటు బోధకునికి ఈ అంశములపైన కనీస అవగాహన ఉండాలి, పూర్తి నిబద్ధత కలిగి వ్యవహరించాలి. అవసరమైతే సాంప్రదాయక ముసుగులో జనాదరణ పొందిన రివాజులను ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఉంటుంది. లేకపోతే సత్యానికి చేరువ కాలేము.


అధికమించటం ఎలా?

ఎప్పుడయితే ‘ప్రత్యక్షతకి’ (revelation), చారిత్రికమైన (సాంప్రదాయాలు, భాషా పరమైన వ్యవహారికం, శైలి, ఆచార – వ్యవహారాలు వంటి వాటి ద్వారా) అఘాధం  ఏర్పడుతుందో... అప్పుడు శ్రోతలు ‘సత్యాన్ని’ కేవలము ‘పరిశీలన’ లేదా ‘పరిశోధన’ ద్వారానే సత్యాన్ని గ్రహించగలిగినట్టుగా చూడగలము.

ఎజ్రా 7: 10 “ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసికొనెను.”

అపొ. కార్యములు 17: 11. “వీరు థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.

కాబట్టి సత్యాన్వేషనకు అనుసరించవలసిన లేదా పాటించవలసిన పద్దతులు ఏంటో ఇప్పుడు చూద్దాం!


వ్యాఖ్యాన పద్ధతులు :-

బైబిలు వ్యాఖ్యానములో సహజంగా అనుసరించే పద్దతులు ప్రధానంగా రెండు. మనకు తెలిసో...తెలియకో రెండవ పద్దతిని ఆశ్రయిస్తుంటాము.

ఎక్ష్సిజీసిస్ (exegesis) అనగా – “సందర్భనిర్దేశిత భావమును వెలికి తీయుట.”

ఎపి-ఎక్ష్సిజీసిస్ (epi-exegesis) అనగా – “ముందస్తు మనోభావాలను అన్వయిoచి అర్ధం చెప్పే యత్నం.”

కానీ సత్యాన్వేషకుల ముఖ్యోద్దేశం ‘సత్యాన్ని’ గ్రహించటం లేదా స్తాపించటం. కాబట్టి ‘సత్యాన్ని’ గ్రహించే ప్రయత్నంలో సిద్ధాంత బోధకు  పట్టుబడకుండా “సందర్భనిర్దేశిత భావము”ను గనుక వెంటాడినట్లయితే శ్రేష్టమైన భావమును కలిగి, సమృద్ధి కరమైన జీవితం, ‘క్రీస్తునందుడి’ జీవించవచ్చును.


బైబిలు వ్యాఖ్యానము - ఎక్ష్సిజీసిస్
సందర్భనిర్దేశిత భావమును వెలికి తీయవలెనన్నా...కొన్ని మౌలిక సూత్రాలను వినియోగించినట్లయితే శ్రేష్టవాక్య భావమును గ్రహించగలము.

1. ఏమిటి (What) సమస్య, సందర్భము లేదా సంభాషణ?

2. ఎప్పుడు (When) వ్రాయబడిన కాలము?

3. ఎక్కడ (Where) నుండి వ్రాయబడినది?

4. ఎవరు (Who) రచయిత, శ్రోతలు ?

5. ఎందు(కు) నిమిత్తము (Why) వెనుక కారణాలు ?

6. ఎలా, ఏవిధముగా (How)  సంగతుల క్రమము, విధము, రీతి?

చివరిగా, వాక్య శ్రేష్ఠభావమును గ్రహించిన పిదప, ప్రస్తుత పరిణామాలకు అన్వయించుటకు (అదీ సందర్భం అనుమతిస్తేనే) ఆలోచించాలి.


--- సహో కారుమంచి ప్రభు దాసు, బైబిలు టీచర్.

No comments:

Post a Comment